Telangana Assembly: వర్షాకాల సమావేశాలు ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభంకానున్నాయి. ఒకప్పుడు ఆంధ్రా అసెంబ్లి సమావేశాలు చాలా ఉద్రిక్తల మధ్య సాగేవి. ఇప్పుడంటే జగన్ అసెంబ్లీ కి రావటం లేదు కాని. లేక పోతే సభ రచ్చ రచ్చ గా ఉండేది. అదే పద్ధతిని కొనసాగిస్తున్నది తెలంగాణా శాసన సభ, కె.సి.ఆర్. (KCR) సభకు రాక పోయినా కొడుకు కె.టి.ఆర్(KTR) , ఇటు హరీష్ రావు (Harish Rao) నిత్యం ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. అయితే ఈ రో జు ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి, ప్రశ్నోత్తరాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్రశిక్ష, పీఎం శ్రీ 2024–25 ఆడిట్ నివేదికలతో పాటు మెట్రోకు సంబంధించిన ఐదు వార్షిక నివేదికలను సభ ముందుకు తీసుకురానున్నారు. ముఖ్యంగా వివాదాస్పదంగా మారిన 22ఏ భూముల వ్యవహారంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సంపూర్ణంగా సిద్ధమైంది. సర్పంచ్లకు నేరుగా నిధులు అందేలా కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్ని కోణాల్లో నిలదీసేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. సభకు వెళ్లేముందు ఉదయం 9 గంటలకు గన్ పార్క్ వద్ద గులాబీ నేతలు అమరులకు నివాళులర్పించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కనీసం నెల రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వాన్ని గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమాయత్తమయ్యారు.
సభలో ప్రధానంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీ, కరెంట్ కోతలు వంటి కీలక సమస్యలపై గళమెత్తేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. ఉద్యోగుల పీఆర్సీ, డీఏల విడుదల, పాలిటెక్నిక్ జీవో 97, సింగరేణి వ్యవహారాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే ప్రధాన అజెండాగా పెట్టుకుంది. ఈ నెల 11 వరకు సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా, బీఏసీ సమావేశంలో క్లారిటీ రానుంది. సభలో చోటుచేసుకునే ఈ రాజకీయ ఘర్షణతో తెలంగాణ పొలిటికల్ హీట్ ఒక్కసారిగా తీవ్ర స్థాయికి చేరింది.




