Konda Surekha: తెలుగు లో ఒక సామెత ఉంటుంది. ఉరుము వచ్చి మంగళం మీద పడటం అంటే ఇదే….కూతురి నోటి దూల అమ్మ రాజీనామా వరకు వచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తే….పదవి ఉంటుందా? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిందో….ఏది ఎమైనా తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారం మరోసారి హాట్టాపిక్గా మారింది. తనపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకునేలోపే మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్బై చెప్పాలని కొండా సురేఖ, కొండా మురళి నిర్ణయించుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారంపై కొండా దంపతులు గురువారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని వారి అనుచరుల నుంచి సమాచారం వెలువడుతోంది.
(Konda Surekha)కొండా సురేఖ వ్యవహారానికి గురువారం సాయంత్రం నాటికి ముగింపు పలకాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడకముందే తన నిర్ణయాన్ని ప్రకటించాలని కొండా సురేఖ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో అనుచరులతో కొండా దంపతులు విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల్లోపు మీడియా సమావేశం నిర్వహించి తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు.
మంత్రి పదవికి రాజీనామాతో ఈ వ్యవహారం ముగియదని, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసే అంశంపై కొండా దంపతులు ఆలోచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే వారి తదుపరి రాజకీయ అడుగు ఏంటన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
తమ భవిష్యత్ నిర్ణయం ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే ఉంటుందని కొండా దంపతులు అనుచరులతో చెప్పినట్లు సమాచారం. ప్రజలే తమకు బంధువులని, వారి అభిప్రాయం మేరకే ముందుకు వెళ్తామని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
మీడియా సమావేశంలో ఏం చెబుతారు?
కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలను కొండా దంపతులు మీడియా సమావేశంలో వివరించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా తమ రాజకీయ ప్రయాణం, తాజా పరిణామాలపై తమ వాదనను ప్రజల ముందు ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో తెలంగాణలో బీసీ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో కొండా దంపతుల మీడియా సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అసాలు ఢిల్లీలో ఏం జరిగింది?
కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద కూడా చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. మంత్రి పదవికి రాజీనామా చేయాలని సూచించినట్లు ఢిల్లీ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి.
రాజీనామా చేయకపోతే మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉందని కూడా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బర్తరఫ్కు ముందే స్వయంగా రాజీనామా చేయడం రాజకీయంగా మెరుగైన నిర్ణయమని కొందరు సహచరులు సూచించినట్లు సమాచారం.
అయితే ఈ అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
రేవంత్రెడ్డి హైదరాబాద్కు రాకతో ఉత్కంఠ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకోనున్న నేపథ్యంలో కొండా సురేఖ వ్యవహారం మరింత ఆసక్తిని రేపుతోంది. సీఎం హైదరాబాద్కు చేరుకునేలోపే తన నిర్ణయాన్ని ప్రకటించాలని కొండా సురేఖ భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
అయితే కొండా దంపతులు కూతురు తెచ్చిన తలనొప్పులతో బి.జె.పి. లో కి వెళతారనే టాక్ కూడా ఉన్నది….ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగంగా సురేఖ కూతురు సుస్మిత ద్వారా పావులు కదిపినట్లు సమాచారం.




