Skip to content
భక్తి

Polala Amavasya: పోలాల అమావాస్య అంటే ఏమిటి? కందమొక్కనే ఎందుకు పూజిస్తారు?

Polala Amavasya: పోలాల అమావాస్య అంటే ఏమిటి? కందమొక్కనే ఎందుకు పూజిస్తారు?

శ్రావణ మాసం లో వచ్చే బహుళ అమావాస్యను ‘పోలాల అమావాస్య‘ అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత వుంది. ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతమును ఆచరిస్తారు. వివాహ అయి చాలాకాలం ఐనా సంతానం కలుగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. సౌభాగ్యం కోసం, పిల్లల యోగ క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం శ్రావణ అమావాస్యనాడు పోలాల అమావాస్య వ్రతం తప్పక చేయాలి.

పూజచేసే చోట శుభ్రంగా అలికి, వరిపిండితో ముగ్గువేసి, ఒక కందమొక్కను (కొందరు 2 కందమొక్కలను తల్లి పిల్లలుగా పూజిస్తారు) వుంచి, దానికి పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను( ఆనవాయితీ ప్రకారం కొంతమందికి 4 తోరాలు వుండవు 2 తోరాలే ఉంటాయి.) అక్కడ వుంచి, ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. గమనిక: కందమొక్క దొరకని పక్షంలో కందపిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును.

అసలు కంద మొక్కనే ఎందుకు పూజించాలి?

Suta Maharshi: ప్రతి పురాణంలో ‘సూత మహర్షి చెప్పెను’ అంటారు.. అసలు ఆయన ఎవరు?

కందమొక్కనే పూజించడానికి ప్రధానంగా సంతానం, సంతాన వృద్ధి, నిలకడైన జీవశక్తి అనే ప్రతీకార్థం ఉందని సంప్రదాయంగా చెబుతారు. కందమొక్కలో ప్రత్యేకత ఏంటంటే, నేలలో ఉన్న కందం నుంచి మళ్లీ మళ్లీ కొత్త మొలకలు వస్తాయి. ఒకసారి నాటితే తిరిగి పెరుగుతుంది, విస్తరిస్తుంది. అందుకే దాన్ని సంతాన వృద్ధికి, వంశాభివృద్ధికి సంకేతంగా భావించారు. పోలాల అమావాస్య వ్రతం కూడా పిల్లల యోగక్షేమం, సంతాన రక్షణతో సంబంధం ఉన్న వ్రతం కాబట్టి కందమొక్కకు ప్రత్యేక స్థానం వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో రెండు కందమొక్కలను తల్లి–పిల్లలుగా భావించి పూజిస్తారు. ఆ మొక్కలో మంగళగౌరీ లేదా సంతానలక్ష్మిని ఆవాహన చేసి పూజించడం కూడా ఆచారంలో భాగం. అంటే సింపుల్‌గా చెప్పాలంటే: “భూమిలో దాగి ఉన్న కందం నుంచి కొత్త జీవం పుడుతుంది కాబట్టి, అది సంతానం–జీవశక్తికి ప్రతీక” అన్న భావనతో కందమొక్కను పూజిస్తారు. తర్వాత మంగళగౌరీదేవిని కానీ, సంతానలక్ష్మిని కానీ ఆ కందమొక్కలోకి ఆవాహనచేసి షోడశోపచార పూజను చేయవలెను. తొమ్మిది పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కధను చదువుకొని కధా అక్షతలను శిరస్సున ధరించాలి. అనంతరం బాగా మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తయిదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించాలి. తాంబూలం లో కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత కందమొక్కకు ఒక తోరాన్ని కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి(సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కందమొక్కకు సమర్పించవచ్చును).

ఏయే నైవేద్యములను సమర్పించాలి?

ఆడపిల్లకావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు సమర్పించాలి. మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పించాలి. పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు. గోదావరి జిల్లాలో కొందరు పనసఆకులతో బుట్టలు కుట్టి, ఇడ్లీపిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతారు. వీటినే పొట్టిక్కబుట్టలు అని అంటారు.

పోలాల అమావాస్య వ్రత కధ:

Neti Dinaphalaalu: నేటి దిన ఫలాలు:

పూర్వం పిల్లలమఱ్ఱి అనే గ్రామంలో సంతానరామావధానులు అనే స్మార్తపండితుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయి, కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్దకోడళ్ళు ఆరుగురికీ పిల్లలు పుట్టారు గానీ, చిన్నకోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోతూండడం జరిగేది. అలా ఆరుసార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికీ ఆ ఆరు సంవత్సరాలూ ‘పోలాల అమావాస్య వ్రతం’ చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈ సారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్దకొడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్యనాడు సుగుణకు ప్రసవమై, మృతశిశువును కంది. ఈ సంగతి తోటికోడళ్ళకు తెలిప్తే తనను వ్రతానికి పిలవరని తలచి, చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి, ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డలమూట వుంచి తన తోటికోడళ్ళతో కలిసి ‘పోలాల అమావాస్య వ్రతాన్ని’ ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో స్మశానానికి వచ్చి, గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని, కన్నీరు మున్నీరుగా విలపించ సాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలు దేరిన పోలాలమ్మదేవి, సుగుణ దగ్గరకు వచ్చి ‘ఎందుకు రోదిస్తున్నావు’ అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, ‘ సుగుణా.., బాధపడకు. నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్లి, ఏ పేర్లయితే నీ పిల్లలకు పెట్టాలను కున్నావో ఆ పేర్లతో వారిని పిలు’ అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుత దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరుపేరునా పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని, వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటికోడళ్ళకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ, పిల్లా,పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి, తరించింది.

Ravinuthala Bhakti

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *